
నారాయణ పేట జిల్లాలోని అన్ని జిన్నింగ్ మిల్లులలో సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను సూచించారు. తెలంగాణ కాటన్ జిన్నింగ్ మిల్లుల సంఘం ఈ నెల 6 మార్కెట్ యార్డులలో మిల్లులు మరియు ప్రైవేట్ కొనుగోళ్లను మూసివేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో నారాయణ పేట జిల్లా లోని జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 7 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయని, వాటిలో ఇప్పటివరకు 5 మిల్లులలో సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయని, పత్తి రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మిగతా 2 మిల్లులలో కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పత్తిని కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ సీసీఐ సంస్థ ప్రతినిధులను కోరారు. దీనిపై స్పందించిన సీసీఐ జిల్లా ప్రతినిధులు తమ ఉన్నతాధికారుల కు సమాచారం ఇస్తామని, తప్పనిసరిగా మిగతా రెండు మిల్లులలో కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి వస్తుందని, కపాస్ కిసాన్ యాప్ లో కూడా మొన్నటి వరకు 12 క్వింటాళ్ల లెక్కనే చూపించిందని, కానీ తాజాగా 12 క్వింటాళ్ల కు బదులు కేవలం 7 క్వింటాళ్ల లెక్క చూపుతోందని ఇది అటు రైతులకు, ఇటు పత్తి రైతులకు సమస్య గా మారిందని మిల్లర్లు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కొనుగోళ్లలో స్లాట్ బుకింగ్ పద్ధతిని కూడా ఎత్తివేయాలని మిల్లర్లు కోరారు. స్పందించిన రెవెన్యూ కలెక్టర్ అది కేంద్రం పరిధిలోని వ్యవహారమని ఏమీ చేయలేమని, కానీ ఈ సీజన్ లో కపాస్ కిసాన్ మొబైల్ యాప్, స్లాట్ గురించి జిల్లా రైతులకు అవగాహన కల్పిస్తే, వచ్చే సీజన్ లో రైతులకు స్లాట్ బుకింగ్ ఇంకా సులువు అవుతుందన్నారు. రైతులు మంచి నాణ్యత గల పత్తిని ఆరబెట్టుకొని 8% నుండి 12 తేమ శాతం ఉండేలా సి. సి. ఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకొని వచ్చి మద్ధతు ధర పొందాలని అదనపు కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ ప్రణీత్, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, సిపిఓ యోగానంద్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారిని బాలామణి, అగ్నిమాపక శాఖ అధికారి సురేష్ రెడ్డి, ఎస్.ఐ. గాయత్రి, సీసీఐ ప్రతినిధులు అనూప్ మిశ్రా, శ్రీనివాస్ రావు, మార్కెట్ కార్యదర్శి భారతి, సూపర్ వైజర్ లక్ష్మణ్, మిల్లర్లు శ్రీనివాస్, పవన్ లాహోటీ, తమన్న, రాహుల్ జై, ప్రవీణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.