
మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీస్ జాగిలంతో ప్రత్యేక తనిఖీలు: మద్దూర్ ఎస్సై శ్రీనివాసులు
నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS ఆదేశాల మేరకు మత్తు పదార్థాల నిర్మూలనకు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా ఈ రోజు మద్దూరు మండల కేంద్రంలో ఈగల్ ఫోర్స్ టీంతో ప్రత్యేక శిక్షణ పొందిన నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు మద్దూర్ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా బస్ స్టాండ్ పాన్ షాపులు తదితర ప్రదేశాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మత్తు పదార్థాల రవాణా, నిల్వ, విక్రయాలు మరియు వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. ప్రజలు ఎవరైనా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను వినియోగిస్తున్నా, రవాణా చేస్తున్నా లేదా సరఫరా చేస్తున్నా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1908 లేదా డయల్-100కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఈ తనిఖీల్లో నార్కోటిక్స్ స్నైపర్ డాగ్ విక్కి, డాగ్ హ్యాండ్లర్ పీసీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.