భాగ్యరెడ్డి వర్మ జయంతి ఉత్సవాలు
సామాజిక సంస్కర్త, దళితోద్యమ ప్రముఖ నాయకుడు భాగ్యరెడ్డి వర్మ జయంతి ఉత్సవాలను శుక్రవారం కలెక్టరేట్లో ప్రజావాణి హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీను జ్యోతి ప్రజ్వలన గావించి, భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, భాగ్యరెడ్డి వర్మ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని అన్నారు. విద్య, సామాజిక సమానత్వం, హక్కుల సాధన కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు విద్యే ప్రధాన ఆయుధమని భావించి, వారికి చైతన్యం కల్పించేందుకు ఆయన నిరంతరం కృషి చేశారని తెలిపారు.
భాగ్యరెడ్డి వర్మ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమానత్వ భావనతో సమాజ అభివృద్ధికి కృషి చేయాలని అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ . డి.ఎస్.సి.కార్పొరేషన్ అబ్దుల్ ఖలీల్, డి.వై.ఎస్.ఓ.వెంకటేశ్ శెట్టి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.